తెలుగు న్యూస్ ఛానళ్లకు సంబంధించి దిగ్బ్రాంతికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. నిత్యం నీతులు చెప్పే టీవీ ఛానళ్లు డబ్బు కోసం అడ్డదారి తొక్కడం పై ఒక మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో బట్టబయలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఏడాదికి 1000 కోట్ల ప్రకటనలు మీడియా సంస్థలకు అందుతున్నాయి. వీటిని అందిపుచ్చుకునేందుకు పలు టీవీ ఛానళ్లు లంచాలు ఎరవేసిన విషయం వెలుగులోకి వచ్చింది. టీవీ ఛానళ్ల పనితీరు, ప్రేక్షకుల ఫాలోయింగ్పై బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రిసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రేటింగ్ ఇస్తుంటుంది. ఇందుకోసం ఎంపిక చేసుకున్న ఇళ్లలో రేటింగ్ మీటర్ బాక్స్లను అమరుస్తుంది. ఇక్కడే తెలుగు టీవీ ఛానళ్లు అడ్డదారి తొక్కాయి.
రేటింగ్ మీటర్లు అమర్చబడిన ఇళ్లను గుర్తించి సదరు ఇంటి కుటుంబసభ్యులకు నెలనెల డబ్బు చెల్లించి ప్రతి రోజు కనీసం రెండు నుంచి నాలుగు గంటల పాటు తమ ఛానళ్లు నిరంతరంగా ట్యూన్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా రోజుకు రెండు గంటల పాటు ఒక ఛానల్ను ట్యూన్ చేసి పెడితే సదరు ఇంటికి రెండు వేలు ఇస్తున్నాయి సదరు ఛానళ్లు. కొద్దిరోజుల క్రితమే ఇలాంటి మోసానికి పాల్పడ్డారంటూ టీవీ9, వీ6 ఛానళ్లను రేటింగ్ నుంచి బార్క్ నిషేధించింది. అయితే ఆ రెండు ఛానళ్లే కాకుండా టీవీ5, ఎన్టీవీ, స్డూడియో ఎన్, జెమిని, ఏబీఎన్ ఛానళ్లు కూడా ఇలా రేటింగ్ మీటర్లు ఉన్న ఇళ్లకు లంచాలు ఇచ్చినట్టు ఒక మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో బయటపడింది.
రోజూ రెండు గంటల పాటు ఛానల్ చూసినందుకు ఎన్టీవీ, గంట పాటు చూస్తున్నందుకు ఏబీఎన్ వాళ్లు డబ్బు చెల్లిస్తున్నారని ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన ఎస్కే బాబా చెప్పారు. అతడి ఇంటిలో బార్క్ వారి రేటింగ్ మీటర్ ఉంది. అతడు చెప్పే మాటలు స్టింగ్ ఆపరేషన్లో రికార్డు అయ్యాయి.
హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన సారయ్య అనే వ్యక్తి తమకు ఎన్టీవీ రెండు వేలు ఇస్తున్నట్టు చెప్పారు. ఇందు కోసం రోజూ నాలుగు గంటల పాటు ఎన్టీవీని ట్యూన్ చేసి ఉంచుతామన్నారు. క్రాంతి అనే వ్యక్తి బాక్స్ను అమర్చారని తొలుత ఎన్టీవీని తెచ్చిన అతడు, తర్వాత స్డూడియో ఎన్, ఏబీఎన్లను కూడా తెచ్చారని సారయ్య చెప్పారు. ఇలా దాదాపు 40 చోట్ల స్టింగ్ ఆపరేషన్ చేసింది సదరు మీడియా సంస్థ.
ఈ స్టింగ్ ఆపరేషన్లో ఎక్కువగా టీవీ5, ఎన్టీవీ, స్డూడియో ఎన్, ఏబీఎన్, జెమిని ఛానళ్ల పేర్లు వినిపించాయి. టీవీ9 కూడా డబ్బు చెల్లిస్తున్నట్టు స్టింగ్ ఆపరేషన్లో వెల్లడైంది. దీనిపై బార్క్ ఎలా స్పందిస్తుందో. ఈ స్టింగ్ ఆపరేషన్లను పరిగణలోకి తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో టాప్ న్యూస్ ఛానళ్లుగా చలామణి అవుతున్న ఛానళ్లు చాలా ఏళ్లుగా మోసాలు చేస్తూ బతుకుతున్నట్టు స్పష్టమవుతోంది.
No comments:
Post a Comment